=''/>

27, డిసెంబర్ 2010, సోమవారం

తేగల సీజన్ ఐపోతుంది.

తేగలు ఇంక లేవు ,ఈరోజు అన్నీ తీసి కాల్పించి తెచ్చేసేము అంటే ... మా సాయి ని హోంవర్క్ చేసుకోనివ్వకుండా, తేగలో చందమామ ని అలా పట్టుకో ,ఇలా పట్టుకో అని కాసేపు వాడిని విసిగించి తేగల ఫోటో పెట్టమని అడిగిన ఫ్రెండ్ కోసం (అందరికోసం )ఇలా...





20, డిసెంబర్ 2010, సోమవారం

నా వందో టపా

సచినే కాదండోయ్ నేనూ కోట్టా" సెంచరీ" ఈ రోజు ... నా "వందో టపా" రాసి :))

పల్లెటూరు లో ఉండే" నేను " బ్లాగ్లోకం లోకి అడుగుపెట్టాను.నేనూ ఓ" బ్లాగ్" రాస్తున్నాను!! అదే నాకుపెద్ద తుత్తి.

కాకపొతే రాసి కన్నా వాసి ముఖ్యం కదా!కొందరు బలే రాస్తుంటారు .అవి చదువుతుంటే నేనూ అలా రాయలేనా ?అనిపిస్తుంటుంది. కానీ, ఏమన్నా కొత్తగా రాయడానికి ప్రయత్నిద్దామన్నాఏవిటో ఏమీ తోచి చావదు . " పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు"వాళ్లవి , వీళ్ళవి చూసి అలా రాయాలని అనుకోవడమెందుకు? అని ఏదో నాకెలా తోస్తే అలా ... నా బుర్రను ఎక్కువ కష్టపెట్టకుండా ఇలా వంద టపాలు పూర్తి చేసేసా :)).

నేన ఏమి రాసినా ఓపికగా చదివి ,కామెంట్స్ రాస్తూ నన్ను ప్రోత్సాహిస్తూ .. ఇంకా బాగా రాయాలనే ఆశక్తిని కలిగిస్తున్న నా బ్లాగ్ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :).

15, డిసెంబర్ 2010, బుధవారం

పచ్చి చింతకాయలొచ్చాయి

తాజా తాజా చింతకాయలు

చూడగానే చటుక్కున కొరకాలనిపించే .... ఆ పులుపుకి మనతోటి ఆబ్బా అనిపించే "పచ్చి చింతకాయలు "వచ్చేసాయి.

చింతకాయలు అక్టోబర్ నుండి ఉంటాయి.(ఇప్పటి వరకూ ఫోటో తీయటం కుదరక నా టపా లేటైంది:)) కార్తీక మాసంలోవచ్చే వనభోజనాల కి, పెళ్ళిళ్ళ లొ భోజనాలకి ఈ" పచ్చిచింత కాయలకి "మాంచి డిమాండ్ .

పచ్చి చింతకాయ-కొత్తిమీరపచ్చడి,చింతకాయ-గోంగూర పచ్చడి పచ్చిచింతకాయ తో వేరుసెనగ, కొబ్బరి కలిపి పచ్చడి ,ఇలా రకరకాల పచ్చళ్ళు చేస్తారు..ఎవరి పొలంలో ఉన్నా దులిపేస్తుంటారు.

పచ్చి చింతకాయలుతో పప్పుచారు చాలా బాగుంటుంది. చింతకాయలు నీటిలో ఉడకబెట్టి పిసికి పిప్పితిసేసి ,ఆ రసం పప్పులో కలపడమే.చేయడం కొద్దిగా సాంబార్ లాగానే ఉంటుంది కానీ ముక్కలు ఎక్కువ వేయరు.సాంబార్ పొడి కుడా వేయకుండా ,మామూలు పప్పుచారు లాగానే చేస్తారు.

చింతకాయ-కందపులుసు,ఆనపకాయపులుసు ఇలా అన్నిపులుసు కూరలు ,చేపల పులుసు కూడా ఈ చింతకాయల తోటే చేసుకోవచ్చు.అలాగే పచ్చళ్ళు చింత పండు బదులు పచ్చి చింతకాయల తో చేస్తే మాంచి రుచిగా ఉంటాయి.కూరలకు ,పప్పు,పప్పుచారుకి ఐతే ఉడకబెట్టు కోవాలి. కానీ ,పచ్చళ్ళ లో కి చింతకాయలను మధ్య కు కొస్తే ,గింజ గట్టిబడదు కాబట్టి పప్పులా ఉంటుంది అది తీసేసి వేసుకోవాలి. ముక్కలతో పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది.


చింతకాయలు దొరికి నన్ని రోజులు చింతపండు వాడకుండా చింతకాయలతోటే కూరలు వండుకోవచ్చ.చింతపండు నిల్వ ఉండి ఈ రోజుల్లో అంత ఫ్రెష్ గా ఉండదు .కాబట్టి దొరికితే వాటితో చేసి చూడండి. చింతకాయలు ఎక్కువగా ఉంటె ప్రిజ్ లో పెట్టినా వారం కంటే నిల్వ ఉండవు.అటువంటప్పుడు వాటిని మధ్యకి కోసి దానిలో పప్పు తీసి ,ఉప్పు తో కలిపి రుబ్బుకుని ప్రిజ్ లో పెట్టు కుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది . కావలిసినప్పుడు కాస్త కాస్త వేసుకోవచ్చు.

అన్నట్టు ఈ రోజు నేను దోసకాయ పచ్చడి పచ్చి చింతకాయలోతోనే చేశానండోయ్ ... :)


11, డిసెంబర్ 2010, శనివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఈ రోజే !

.

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగాతమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.

తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి,సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది

.సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు.

మా జిల్లాలో అత్తిలోను,తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు లోనూ షష్టి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

చిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో" యాదవోలు" అనే ఊరు వెళ్ళే వాళ్లము. అక్కడ బాగా జరుగుతుంది. మేము,తెలిసినవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు అందరమూ కలిసి ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు అవి తిరిగి మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .అప్పుడు షష్టి కి స్కూల్ కి సెలవుండేది.(ఇప్పుడు చాలా మంది పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామి షష్టి అనే ఓ పండుగ ఉంటుందనే తెలీదేమో ) .


ఇప్పుడైతే మా ఉళ్ళో శివాలయం లోనే సుబ్రహ్మణ్య స్వామి ని ప్రతిష్టించారు. ఇక్కడికే వెళ్తున్నామంతా..మా సాయి , నేను రాను బడుంది అన్నా బలవంతంగా వాడిని తీసుకునే ఉదయం గుడికి వెళ్లొచ్చాను..

10, డిసెంబర్ 2010, శుక్రవారం

ఇవేమి వర్షాలు ?మాకొద్దు బాబోయ్ :(

ఈ మూడు రోజు ల నుండి కురిసిన వర్షాల వలన ఎక్కువగా నష్ట పోయింది ఎవరంటారు??ఇంకెవరూ మేమే ( రైతులే) :(( .

గడిచిన నాలుగు నెలలుగా వానలు ఏదో రూపంలో రైతులను దెబ్బ తీస్తూనే ఉన్నాయి.

ఈ సంవత్సరం సకాలంలో పడిన వర్షాల వలన వరిచేల ఊడ్పులు సరైన సమయం లో ఐపోయాయి . కానీ తరువాత విపరీతంగా కురిసిన వర్షాలకు మా వరిచేలు మునిగి రెండు రోజులున్నాయి .ఎలాగో నీళ్ళలో నుండి బయటపడి తేరుకు న్నాయనగానే , మళ్ళి నెలకు కురిసిన భారీ వర్షాలకు మా పొలం పక్కనున్న కాలవకు గండి పడి మూడు రోజులుమునిగి ,నానిపోయి చచ్చీచెడి ఎలాగో బయట పడ్డాయి..

మధ్య మధ్యలో జల తుఫానని ,అల్పపీడనాలని ,వాయుగుండాలని అడపా దడపా వానలు పడ్డాయి కానీ ఎలాగో వీటన్నిటి బారీనుండి తప్పించుకుని వరి చేలు కోతలకు వచ్చాయి. మిషన్ తోటేగా కోయడం మూడు రోజులలో అయిపోయాయి. అమ్ముడానికి ఇప్పుడు మంచి రేటులేదని ,బస్తాల్లో ఇంటికితెచ్చి నిలవ చేయడానికి అన్నీ సిద్దం చేసారు.. ఈ వెదవ వర్షాలు ఒక్క రోజాగితే ..కష్టపడి పండించిన పంట ఇంటికి చేరేది. ప్చ్ :( ఏంచేస్తాం??పైన ఎన్ని కప్పి ఉంచినా వర్షాలు బాగా పడటంతో కళ్ళం లో ఉన్న ధాన్యం తడిచి పోయి చేలోనే ఉంది.ఏంచేయడానికి లేదు.. రెండు రోజులనుండి కురిసిన వానలకు మడులన్ని నిండి అవి బయటకు తీయడానికి లేదంట. చాలా మందికి ఇలాగే అయింది.

వరిచేను గొడవ ఇలా ఉంటే ,పుగతోటల పని ఇంకా గొప్పగా ఉంది.

మాకు ఇప్పుడు" పుగాకు" సీజన్ .ఈ పుగతోటల పనులు మొదలైతే అంతా బిజీ బిజీగా ఉంటారు . నారుమళ్ళు కట్టడం దగ్గర నుండి ,పుగాకు గ్రేడింగై .. అమ్మకాలు అయ్యేవరకూ పుగతోటని, పుగాకు ని చాలా జాగర్తగా చూస్తారు.ఒక్క ఆకు కూడా పోకుండా చూడాలి.పెరిగే దశ లో వానలు అసలు పడకూడదు. వాన నీటిలో తడిసిన ఆకులు బరువును ,జిగురు కోల్పోయి ఉడికించేటప్పుడు నల్లగా మాడిపోతాయి.మంచి రంగురాదు .అలా ఐతే ఆ పుగాకు కు ధర సరిగారాదు.పెట్టిన పెట్టుబడి,శ్రమ అంతా వృదా అవుతుంది. అందుకే చాలా జాగర్తగా వాటిని చంటిపిల్లలను చూసినట్టు చూడాలి అంటారు.

పుగ తోట లకి జులై లో నారుమళ్ళు పెంచుతారు సెప్టెంబర్ నెల మధ్య నుండి తోట వేయడం మొదలుపెడతారు. ఇదిగో ఈ వర్షాలకు అలా అలా అక్టోబర్,నవంబర్ వరకూ వేస్తానే ఉన్నారు. అస్తమానూ కురుస్తున్న వానలకు చచ్చిపోయిన మొక్కల స్థానం లో కొత్తమొక్కలు వేస్తూ ఎలాగో ఇప్పటికి ఓ దశ పూర్తైందని ,కాస్త విశ్రాంతిగా ఉన్నారో లేదో మళ్ళి వర్షాలు బాగా పడటంతో నీళ్ళు నిల్వ ఉండి పోయి సగం మొక్కలు కుళ్ళి ,కొన్ని తలలు వాల్చి తోటలన్నీ నానా బీబత్సంగా ఉన్నాయంట.

మన ప్రభుత్వం వారు ఏరియల్ సర్వేలు చేసి ,రకరకాల ప్రకటనలు చేయడమే కానీ అవి రైతులకు ఏమేరకు ఉపయోగపడ్డాయో అని కూడా చూడరు.

ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత పైనే ఆధార పడి ముందుకు సాగాలిగా..

8, డిసెంబర్ 2010, బుధవారం

రకరకాల పువ్వులు

గోవర్ధన పువ్వులు



చంద్రకాంత దేవకాంతలు.




తెల్ల దేవకాంతలు





మే ఫ్లవర్స్



కోడిగుడ్డు సెంపెంగ





6, డిసెంబర్ 2010, సోమవారం

ఓ ప్రియతమా..


పేపర్లో చదివిన చిన్న కవితకు ఓ రోజంతా కష్టపడి,నా మైండ్ కి కాస్త పని కల్పించి ఈ రూపం తెచ్చా... ఆఖరి రెండు లైన్లూ నేను చదివిన కవితలోనివి.

నా ఈ ప్రయత్నం ఎలా ఉందో మొహమాట పడకుండా చెప్పండే .

సందె గాలిలో సన్నజాజి సుగంధంలా
మలి సంధ్య లో మలయ మారుతంలా
మొగలి రేకుల పరిమళాలతో నను తాకిన ఓ ప్రియతమా !

నీ నవ్వుతో కోటి సరాగాల వీణలు వాయించావు
నీ స్పర్శతో వేయి వేణువులు ఉదావు
నీచూపుతో నాలో వందలాది తంబురాలు మోగించావు
నీ సిగ్గులో ఎన్ని సితారలో పలికించావు

నీ కులుకుల నడకల హోయలతో నన్ను గిలిగింతలు పెట్టావు
నీ తియ్యని పలుకులతో నా మది దోచావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాలతో
నా జీవితం ఓ సరికొత్త రాగంలో పాటలా ఇలా సాగిపోతుంటే

ఈ మైమరుపు వెన్నెలలో ఆ మైమరపించే జాబిలీ కంటే
నీ మదుర స్మృతులే ఇక నా జీవన పయనానికి ఆలంబన

1, డిసెంబర్ 2010, బుధవారం

మా పొలంలో వన బోజనాలు













"పాపికొండలు"వెళ్ళాలనిఅనుకుంటున్నాము... అన్నాను కదా! కానీ ,ఎక్కడో నాకు అనుమానం గానే ఉంది.. అది జరిగేలా లేదని :((( .నేననుకున్నట్లే అయింది.

ఇరవై నాలుగున మా ఆడబడుచు వాళ్ళమ్మాయికీ " ఓణిఫంక్షన్ " అయింది.ఆ మరునాడు పాపి కొండలు వెళదాము....అందరూ ఉంటారు! అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన వెళ్ళ లేకపోయాము.

పాపికొండలు వెల్లట్లేదని చెప్పగానే మా" పిల్లలు" ఏడుపులు మొదలెట్టేశారు. మా అమ్మాయైతే చెప్పక్కర్లేదు....హాస్టల్ లో అందరికీ చెప్పేసేను వెళ్తున్నామని, మీరెప్పుడు ఇంతే...ఎక్కడికి తీసుకెళ్ళారూ..... అంటూ నిష్టూరాలు....


పిల్లలు ముగ్గురూకలిసి (మా ఆడబడుచు కూతురు ,మా పిల్లలు)"మనం రేపు ఎక్కడికైనా వెళ్లాల్సిందే" ... అంటూ ఓ ఆర్డర్ పాడేసి మేమంతా ఒప్పుకుంటేనే కానీ ఊరుకోలేదు.










వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి??మా వారు ,వాళ్ళు ఇప్పుడు పుగతోట ( మార్చి నెల వరకూ పుగాకు తోట పనులుంటాయి)పనులతో
చాలా బిజీ గా ఉంటారు..వాళ్ళ వల్ల ఏమీ పని జరగదు... ఎలాగా ?అనుకుంటూ "పొలం "వెళ్దామా?? "కార్తిక మాసం" కదా "వనభోజనాలు" పెట్టుకున్నట్టు ఉంటుంది. సరదాగా పొలంలో తిరిగి ,పుగాకు తోట ,కొబ్బరితోట అన్నీ చూసినట్టు ఉంటుంది...అన్నాను.

పిల్లలు ఏమంటారో?? అని ఎదురుచూస్తూ....

వీళ్ళు ఒప్పుకోక పోతే ఏంచేయాలి???ఏమంటారో ...అనుకున్నాను కానీ ,ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఊపు మీదున్నారేమో...వెంటనే ఒప్పేసుకున్నారు....

మీరు ఉదయమే తొందరగా లేచి మీ పనులన్నీ చేసుకుని మాకు సాయం చేస్తే ,పదింటికల్లా పొలం వెళ్ళగలుగుతాం....అంటే ,పాపం అలాగే కనపడని సాయం చాలా చేసారు...

అనుకున్నట్లే ...అన్నం ,కూరలు,స్నాక్స్ ,మంచినీళ్ళుతో సహా అన్నీ సర్దుకుని ట్రాక్టర్లో ... పదిగంటలకి పొలం వెళ్లేము.

ప్రియ చూసారా? ఎలా ఎక్కిందో ? ఎక్కింది కానీ దిగడం రాలేదు .అందరం కష్టపడి ఎలాగో దింపాం లెండి..

వెళ్ళగానే ఆట ,పాటలు మొదలెట్టేశారు.వాళ్ళతో కలిసి మేమూ ... హౌసి, రాముడు-సీత ,కళ్ళ గంతలు ఇలా రకరకాల ఆటలన్నీ ఆడేము.వంగిపోయిన కొబ్బరిచెట్టు ఎక్కేపోటీ పెట్టేము..అందరూ ఎక్కడానికి ట్రై చేసారు కానీ, , ప్రియ బాగా పైకేక్కింది.దానికి అందరూ కలిసి మూడు కొబ్బరి బొండాల నీళ్ళు పట్టించేసేరు.(ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ) .

అమృతకి(ఆడబడుచు కూతురు ) హౌసి లో ఫస్ట్ వచ్చిందని.....

ఆటల్లో నెగ్గినవాళ్ళకి గిఫ్ట్లు ఏంటా?? అనుకుంటున్నారా?? రెండు కొబ్బరి బొండా లు తాగడం , నాలుగు జామ కాయలు,బురగుంజు తినడం:)))) ఇలా ....(మా పిల్లలు ఆరోజే మొదటి సారి బురగుంజు చూడటం ,తినటం)
కాసేపుకోతుల్లా...జామ చెట్లు,మామిడి చెట్లు ఎక్కి ,దిగి ,ఉయ్యాలలూగేరు. మాపొలమంతా తిరిగేక,పక్క పొలం లో కోకో తోటలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ,కోకో కాయలు, మొక్కలు చుపించేము.


కోకోకాయలు

పిల్లల ఆనందానికి అంతేలేదు.మా ఆడబడుచు కూతురు అత్తా "మేం వచ్చినప్పుడల్లా పొలం ఇలాగే వెళదాం" అంది.దానికి అంత నచ్చేసింది. . మాపిల్లలూ అప్పుడప్పుడూ... పొలం వెళ్తుంటారు కానీ,కాసేపు అలా తిరిగి వచ్చేస్తారు.ఇలా ఎప్పుడూ వెళ్లక కొత్తగా ఉండి వాళ్ళకీ బాగానచ్చేసింది.

అలా ..సాయంత్రం వరకూసరదాగా... ఆనందంగా ...గడిపేసేమంతా...

మా పిల్లల గొడవ వలన "కార్తిక వనబోజనాలు"కూడా చేసినట్లైంది.
.


బుజ్జి కుక్కపిల్లలు బలే ముద్దొస్తున్నాయికదా! పొలంలో ఉన్నాయి .మాపిల్లలు వాటిని తెచ్చి,అవి తినక పోయినా ..బలవంతంగా వాటికి పులిహార పెట్టేసి వాటిని బెదిరించేసేరు.