=''/>

29, అక్టోబర్ 2010, శుక్రవారం

కొండగాలి తిరిగింది

"కొండగాలి తిరిగింది ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది "ఎంత చక్కని పాట!ఎన్ని సార్లు విన్నా విసుగురాదు.చిన్నప్పుడు రేడియో లో వినటమే కానీ ఈ మధ్య వినలేదు .ఒకరోజు ఎఫ్ ఎం రేడియోలో విని , డౌన్ లోడ్ చేద్దామని చూస్తుంటే ఇదిగో ఇలా మిక్స్ చేసిన వీడియో దొరికింది .

ఘంటసాల గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ఈ మధ్య నే చనిపోయిన కె.బి.తిలక్ గారి దర్శకత్వంలో 1965 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలోది. పెండ్యాల నాగేశ్వరరావ్ గారు స్వరపరిచారు .వ్రాసింది ఆరుద్ర గారు.
ఘంటసాల గారు పాడిన ఇటువంటి మెలోడి పాటలను , ఈ లోకాన్ని మరిచి పోయి ఆనందంగా ఎంతసేపైనా వినేయవచ్చు.







కొండగాలి తిరిగిందీ ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...


పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...ఆ ఆ
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది....గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడిందిఆ ..ఆ..


పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది ఆ ఆ ఓ ఓ ఆ ఆ ...
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ... .. ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందదీ ....
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్విందిఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ..

పడుచుదనం అందానికి తాంబులమిచ్చిందదీ ...ఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ...
పడుచుదనం అందానికి తాంబులమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది ఆ ఆ ఆ... ...

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

25, అక్టోబర్ 2010, సోమవారం

ఆటపాటల అట్లతద్ది ఈ రోజే నండోయ్


కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. . కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.... నోచుకునే నోము కావడం ఈ పండగలో ప్రత్యేకత." ఆశ్వీయుజ బహుళ తదియ" నాడు అట్లతద్ది పండుగ వస్తుంది. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. చల్లని రాత్రి చేతులకు గోరింతాకు పెట్టుకుని ... దుప్పటి ముసుగుతన్ని నిదురోయిన ఆడపిల్లలు తెల్లవారు జామునే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం,ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుండే పెద్ద పెద్ద వేప ,మామిడి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఉగుతూ... అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు.


అన్ని వ్రతాలకి ఉపవాసముండి తరువాత పూజ చేస్తారు .అట్లతద్దికి అలా కాదు ,సూర్యోదయానికి ముందే బోజనం చేసి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ,పూజ చేసుకుని వాయినాలిస్తారు.నోము చేసుకునే స్త్రీలు ముతైదులకు తలంటు స్నానానికి కుంకుడుకాయలు పంపిస్తారు . పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది.

ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది


పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... నెమ్మిదిగా మరుగున పడిపోతాయేమో!.

21, అక్టోబర్ 2010, గురువారం

మా పెరట్లో తిరిగే సీతాకోకచిలుకల చిత్రాలు

మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉండడం తో సీతాకోకచిలుకలు బాగా వస్తుంటాయి. రంగురంగుల రెక్కలను అల్లల్లాడిస్తూ అవి పువ్వుల్లో మకరందం కోసం ......ఒకపువ్వు పై నుండి ఇంకో పువ్వు పై వాలుతూ ...అటూ,ఇటూ ఎగురుతుంటే చూడడానికి బలేఉంటుంది. ఫోటో తీయాలంటే మాత్రం చాలా కష్టం సుమండీ....


ఈ సీతాకోకచిలుకల ను ఫోటోల్లో బందించడానికి అష్ట కష్టాలు పడుతుంటాను.అవి అసలు ఒక పువ్వు మీద నుండి ఇంకో పువ్వు మీదకి అలా తిరుగుతూనే ఉంటాయి .ఒక్కో పువ్వు మీదా అరనిముషం ఉంటాయేమో ,ఫోటో తీయడానికి రెడీ అయ్యేలోపు వెళ్లి పోతుంటాయి .వాటి వెనకాల పరిగెడుతూ ఎలాగో తీస్తాను. ఒక్కోసారి గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయి .కానీ ఫోటోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.




ఇదేంటో ఇలా మడ్డి రంగులో ఉంటుంది .ఇది మిగిలిన వాటిలా ఓ ఎగిరిపోదు దేనిమీద వాలితే దానిమీదే ఉంటుంది బద్దకంగా .ఇది సీతాకోకచిలుక ల్లో ఒక జాతంట.

















ఇది పెద్దగా ఉండి లైట్ నీలం రంగు రెక్కలతో చాలా బాగుంటుంది.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

హమ్మయ్య బ్లౌజ్ మీద వర్కు చేయడం ఎలాగో పూర్తిచేసేసా ..



రెండు నెలల నుండి ఈ జాకిట్టుకి వర్కు చేస్తున్నాను.ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైంది లెండి .ఎవరికైనా చీరల మీద వర్క్ చేయడానికి రెండుమూడు నెలలు టైం తీసుకుంటారు .మరి నాకు బ్లౌజ్ మీద వర్కు చేయడానికి ఇంత టైంపట్టింది.



ఇది మెడ డిజైన్.మెడ అంచుకి అవుట్ లైన్, జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టి .... డైమండ్స్ కూడా జరీ దారం తో గొలుసు కుట్టు కుట్టాను.మధ్య లో పచ్చ దారంతో ముడులు వేసాను. అలాగే పువ్వులుకుడా జరీ దారంతో కుట్టి మధ్యలో గోల్డ్ పూసలు కుట్టాను .

ఇక మధ్యలో ఖాలీ అంతా గొలుసు కుట్టుతో దగ్గరగా కుట్టి మొత్తం నింపేసా ...అలా గొలుసు కుట్టుతో నింప డాన్ని పానీ వర్క్ అంటారు.



చేతులకి ఇలా అంచు కుట్టి పైన పువ్వులు, బుటా వేసాను.


హమ్మయ్య ఎలాగో పిల్లలకి సెలవలు వచ్చేటప్పటికి పూర్తిచేసేను.వాళ్ళు ఇంటివద్ద ఉంటే అసలు కుట్టడం అవ్వదు.

మొత్తం డిజైన్, కుట్టు ఐడియా అంతా నాదే . ముందు మెడకే కుడదామని మొదలు పెట్టాను కానీ మెడ వర్కు అయ్యాక ,నా చేతుల దురద ఇంకా తీరక అలా ... అలా .. ఇలా కుట్టేసాను. చాలా తొందరగా రెండు నెలలలోనే పూర్తి చేసేసేను కదా .... -:)

ఎలాఉందంటారు?వర్కు ,డిజైను ...

5, అక్టోబర్ 2010, మంగళవారం

వంటింటి దివ్యౌషదం - మిరియాలు


మనకు అందుబాటు లో ఉండే వంటింటి దివ్యౌషదం" మిరియాలు ".

ఈ మిరియాలలో ఎన్నో ఔషద గుణాలున్నాయి.ముఖ్యంగా జలుబు ,దగ్గు తగ్గించడానికికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి.

వర్షాకాలంలో అస్తమానూ జలుబూ,దగ్గు వస్తూఉంటాయి .ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మాత్రలూ అవీ వాడకుండా మిరియాల కషాయం తాగి చూడండి. ..మీకే తేడా తెలుస్తుంది.

అమ్మో కషాయమా! అనుకుంటున్నారా? కషాయం అంటే సినిమాలలో అదీ చూపించినట్టు కష్టపడి తాగాలా అనుకోకండి. చేయడమూ కష్టం కాదు, తాగడము కష్టం కాదు .

మిరియాల కషాయం ఎలా చేయాలంటే...

ఒక స్పూన్ మిరియాల పొడి ,కొద్ది గా అల్లం ముద్దా ,గుప్పెడు తులసాకులు ఒక కప్పు నీళ్ళలో వేసి ఐదు నిమషాలు సేపు తక్కువ మంటపై మరగనివ్వాలి. దానిని ఒక గిన్నె లోకి తీసికుని , దానిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయమూ ,సాయంత్రమూ తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది .ఇది ఏరోజుకారోజే చేసుకోవాలి.


ఎవరికి జలుబు చేసినా మాఇంట్లో ఇదే మందు. . మా అబ్బయి మోదట్లో ఈ కషాయం తాగడానికి కొంచెం పేచీ పెట్టాడు కానీ ఇప్పుడు కాస్త తుమ్ములెక్కువగా వస్తే చాలు మిరియాల మందు కావాలి అని అడిగి మరీ చేయించుకుంటాడు.


మా ఇంట్లో మాములుగానే మిరియాలు ఎక్కువగా వాడుతుంటాము.అన్నిట్లోనూ వేస్తూ ఉంటాము. కొద్దిగా మిరియాలపొడి ,కొద్దిగా బెల్లమూ వేసి కలిపిన పాలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా తాగారా ? తాగి చూడండి .అలాగే ,ఆమ్లెట్ లోనూ కారం బదులుగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. టి లో కూడా కొద్ది గా మిరియాలపొడి వేస్తే కొంచెం ఘాటుగా ఉండి గొంతుక్కి బాగుంటుంది .మిరియాల పొడి లేకుండా జున్ను అసలు వండరు .ఇలా అన్నిట్లోనూ మిరియాల పొడి ఉండాల్సిందే.

మిరియాలు , అల్లం రసం అజీర్ణ సమస్య ఉన్న వారు తీసుకుంటే బాగా పనిచేస్తుంది.అలాగే ఆకలి తక్కువగా ఉన్నవారు మిరియాల పొడిని ఒక స్పూన్ తేనే తో కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది.మిరియాలు వేసి మరిగించిన నీరు పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి తగ్గుతుంది.గొంతు నొప్పి ఉంటే కొన్ని మిరియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఇలా రక రాకాలుగా మిరియాలను ఉపయోగించొచ్చు.


ఇవన్నీ చిట్కాలే ఐనా వీటిని ఆచరించడం వలన ఒక్కోసారి తొందరగానే ఫలితం కనిపిస్తుంది .ఆచరించడం వలన నష్టమేమి ఉండదు కదా .ఇవన్నీ చేసినా ఎమీ లాభం లేక పొతేఇంక డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిందే.. .. .